రేపు '28/11/2020' శని త్రయోదశి! Sani Trayodasi

 

రేపు '28/11/2020' శని త్రయోదశి!

శని త్రయోదశి కేవలం శనిదేవుడి ఆరాధనకే కాదు!

భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై, నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం, మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించాలి. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి, పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే, ఆయనను కర్మ ఫలదాత అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడే, జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ, లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు, వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు.

సూర్యభగవానుడూ, ఛాయా దేవి సంతానమే, శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడనీ, ఛాయాసుతుడనీ అంటారు. నవ గ్రహాల్లో కీలకమైన శని, జాతక చక్రంలోని ఒక్కో రాశిలో, దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు. అంటే, రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి, దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి, శనికి మందగమనుడు, అనే పేరు ఉంది. అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి, ఫలితాలు కూడా ఉంటాయి. జాతకరీత్యా, శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు, తమకు తక్కువ శ్రమ కలిగించాలని, శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం, నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆయనను పూజిస్తే, మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం. అయితే, శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం, శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి.

స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా, శనిత్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా, ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి, శనీశ్వరుడి గురించి పొగడటం మొదలుపెట్టాడు. ఎంతటివారైనా, శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడు, ‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అని అన్నాడు. ఇదే మాటను నారదుడు, యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు. ‘నా ప్రభావం నుంచి తప్పించుకోవడం, ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం.. ’అని చెప్పిన శని, పరమేశ్వరుని, ఫలానా సమయంలో పట్టి పీడించి తీరతానని అన్నాడు. శని శపథం గురించి విన్న శివుడికి, ఏం చేయాలో అర్థంకాక, మాట నెరవేరితే, తన ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే, శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు, భూలోకంలో, ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు.

మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుడిని చూసిన శివుడు, ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది?’ అంటూ పరిహసించాడు. దీనికి శని, ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు, ఆ చెట్టు తొర్రలో దాక్కున్నావే! అది నా ప్రభావం కాదా? దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు. శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు.. ఈ రోజు నుంచి, శనిత్రయోదశి నాడు, ఎవరైతే నిన్ను పూజిస్తారో, వారికి నీ అనుగ్రహంతో పాటు, నా అభయం కూడా దక్కుతుందన్నారు. ఇక నుంచీ నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరఢవిల్లుతావని, ఆశీర్వదించాడు. అప్పటి నుంచి, త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు, నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని, వేడుకుంటున్నారు.

ఓం శం శనైశ్చరాయ నమః

Link: https://www.youtube.com/post/UgyASYBVYIzt_8xhUtl4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes