అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుతమైన కథ - ‘పగ’!


అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుతమైన కథ - ‘పగ’!

‘ధర్మ శాస్త్రజ్ఞులు ధర్మ శాస్త్రంబని – యధ్యాత్మ విదులు వేదాంతమనియు

నీతి విచక్షుణుల్ నీతి శాస్త్రంబని – కవి వృషభులు మహా కావ్యమనియు 

లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని – యైతిహాసకు లితిహాసమనియు

బరం పౌరాణికుల్ బహుపురాణ సముచ్చ -యంబని మహి కొనియాడుచుండ’

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/t43ByMxiNNs ]

అని నన్నయ్య మహా భారతం గురించి, చాలా గొప్పగా వర్ణించాడు. ఈ గ్రంధాన్ని, ఏ వర్గానికి చెందినవారు చదివితే, అది వాళ్లకు సంబంధించినదిగానే భావిస్తారని, తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. మన పురాణాలలో, అత్యంత మహిమాన్వితమైన గ్రంథంగా భాసిల్లుతోన్న మహా భారతంలోని ప్రతీ వ్యక్తీ, ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నారు. వారిలో అత్యంత ముఖ్యులు, భీష్మ పితామహుడు. మహాభారతంలో, అత్యంత శక్తివంతమైన, ప్రధానమైన వ్యక్తి, భీష్ముడు. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. దేవలోకంలో ఇంద్రుడూ, శ్రీమహావిష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన అష్ట వసువులలలో ఒకరు, భీష్ముడు. అష్ట వసువులంటే, సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధరా, అనిలా, అనలా, అహా, ప్రత్యూషా, ప్రభాసా, సోమా, ధృవులు. వీరు వశిష్టుని శాపంతో, మానవులుగా జన్మించారు. ఈ ఎనిమిది మందిలో భీష్ముడు తప్ప, మిగతా ఏడుగురూ, పుట్టిన కొద్దికాలానికే దేవలోకం చేరుకున్నారు.

కురుకుల యోధుడైన భీష్ముడు, తన తండ్రికిచ్చిన మాటకు కట్టుబడి, ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. పాండవులతో పోరు మంచిది కాదని, ధుర్యోదనుడికి హితబోధ చేసినా, అతడు వినిపించుకోకపోవడంతో, అయిష్టంగానే యుద్ధంలో పాల్గొన్నాడు భీష్ముడు. అధర్మపక్షాన నిలబడి, ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే, ఇఛ్చా మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు, తన మరణాన్ని స్వాగతించాడు. అదే, తన అసమర్థతకు శిక్ష అని భావించాడు. అంపశయ్య మీదున్న భీష్ముడు, పాండవులకు, ముఖ్యంగా ధర్మరాజుకు, రాజధర్మం, రాజనీతి గురించీ, అనేక విషయాలను తెలియజేశాడు. లౌక్యం, రాజ్యపాలన గురించి భీష్మపితామహుడు చేసిన ఉపదేశాలు, కాలం మారినా, వాటి విలువను మాత్రం కోల్పోలేదు. అంతేకాక, స్నేహంలో ఉండాల్సిన పరిమితులూ, పగ వల్ల పొంచి ఉండే ముప్పు గురించీ, ఓ చిలుక కథ ద్వారా తెలియజేశాడు. ధర్మరాజుకు భీష్ముడు తెలియజేసిన ఆ చిలుక కథేంటో, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము...

బ్రహ్మదత్తుడనే రాజు, ఒక చిలుకతో స్నేహం చేసేవాడు. ఆ చిలుక, బ్రహ్మదత్తునికి సమీపంలోనే నివసిస్తూ ఉండేది. కాలం సాగుతుండగా, ఆ చిలుకకు ఒక మగ చిలుక జన్మించింది. బ్రహ్మదత్తుని కుమారుడు, ఆ చిట్టి చిలుకతో ఆటలాడుకునేవాడు. ఒకరోజు, చిలుకతో ఆటాడుతున్న రాకుమారుడికి, దానిపై కోపం వచ్చింది. వెంటనే, దానిని తన చేతులతో చిదిమేసి, ప్రాణాలు తీశాడు. ఆ దృశ్యాన్ని చూసిన చిలుక ఆక్రోధంతో, తన కుమారుడి మరణాన్ని సహించలేక, తన గోళ్లతో రాకుమారుడి రెండు కళ్లూ పొడిచింది. దాంతో రాకుమారుడు చూపుపోయి, అంధుడిగా మారిపోయాడు. చిలుక అంతటితో ఆగకుండా, రాజు దగ్గరకు వెళ్లి, జరిగన విషయమంతా చెప్పింది. ‘రాజా! నీ కుమారుడు నా బిడ్డను చంపి, తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతడి కళ్లను పొడిచి, గుడ్డివాడిని చేశాను. ఇది నేను ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు. ఇకమీదట నేనిక్కడ ఉండలేను’ అని చెప్పింది. 

చిలుక మాటలు విన్న రాజు, ‘నువ్వన్నది నిజమే! జరిగినదానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకి హాని తలపెట్టాడు కాబట్టి, ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. ఇందులో నువ్వు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది? దయచేసి ఇకమీదట కూడా, నాకు మిత్రుడిగానే ఉండు’ అని అర్థించాడు. దీనికి చిలుక బదులిస్తూ..‘రాజా! నేను నీ కొడుకుని అంధుడిగా మార్చేశాను. కాబట్టి మీకు నా మీద పగ, ఏర్పడి తీరుతుంది. పగ అనేది నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇతరుల భూమిని అపహరించడం వల్లా, ఆస్తి పంపకాల్లో అన్నదమ్ముల మధ్యా, ఆడవారి మధ్య మాటామాటా పెరగడం వల్లా, ఎదుటివారి మనస్సుని గాయపరచడం వల్లా. ఇటువంటి ప్రతికూల భావాలు ఒక్కసారి మొదలైతే, ఇక వాటికి అంతం ఉండదు. అలాంటి విద్వేషపూరిత వాతావరణంలో, ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు. నేను నీ కొడుకుకి అపకారం చేశాను కాబట్టి, మీకు నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది. కాబట్టి, మీ తీయ్యని మాటలు విని నేను ఇక్కడ ఉండలేను,’ అంటూ చిలుక ఎగిరిపోయింది. 

కాబట్టి ధర్మరాజా! రాజనేవాడు, చిలుక మాదిరిగా తన జాగ్రత్తలో తానుండాలి. రాజ్యంలో ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. సుతిమెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలే కానీ, మనస్సు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ, తన జాగ్రత్తలో తానుండాలి. ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగకూడదు. వ్యసనాలకు బానిసై, విచక్షణ కోల్పోకూడదు. అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా, రహస్యాన్ని బయటపెట్టకూడదు. అంతేకాదు, పూర్తిగా తీరని రుణం.. పూర్తిగా ఆరని మంట.. పూర్తిగా చల్లారని పగ.., ఈ మూడింటి విషయాల్లోనూ, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా పరిణమించగలవంటూ, భీష్ముడు ధర్మరాజుని హెచ్చరించాడు.

ఇవి కేవలం ధర్మరాజుకు మాత్రమే ఉపయోగపడే అంశాలు కావు.. నేటి సమాజం కూడా ఆమోదింపదగిన హితోక్తులు. అంపశయ్యపై ఉన్న భీష్ముడు చిలుక కథ ద్వారా చెప్పిన సూత్రాలు, నేటికీ ఆచరణీయాలే.. శుభం భూయాత్!

[ గణపతిని పూజించే పాశ్చాత్య దేశాలు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/PU6pP-tN6Ts ]

Link: https://www.youtube.com/post/UgwmUXp7CkAuVSlZiXx4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes