అపుత్రస్య గతిర్నాస్తి?!


అపుత్రస్య గతిర్నాస్తి?!

పిల్లలు లేని వారి పరిస్థితి ఏమిటి? వారి ఆత్మ పరిస్థితి ఏమిటి? అని చాలా మంది అనుకుంటారు. వంశోద్ధారణ చేసే కొడుకు లేక పోతే.. అంటే, చనిపోయాక తలకోరివి పెట్టెవారు లేకపోతే తమ గతేమిటి? అనీ, పితృ కార్యాలు ఆగిపోతాయనీ వ్యధ పడుతూ ఉంటారు చాలామంది. దీనికి సంబంధించి, ప్రాచీన గ్రంధాలు ఏమి చెబు తున్నాయి? శాస్త్ర నిర్ణయం ఏమిటి?

[ శ్రీశైల మల్లన్న చరిత్ర! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GB1zba8LD3g ]

పిల్లలు లేకపోతే నరకం అన్నది నిజం కాదు!

వేదోక్త కర్మలు చేసేవారూ, జ్ఞాన సంపాదన చేసేవారూ, ధార్మికంగా బతికి శాస్త్రోక్త పద్ధతిలో విధి నిషేధాలు పాటిస్తూ సాధన చేసే వారూ, పిల్లలున్నా, లేకున్నా, వారి వారి సత్కర్మల వల్ల ఉద్ధారం అవుతారు. పాపులూ, దుష్కర్మలు చేసినవారూ, వారికి పుణ్యం లేకపోతే వారి పిల్లల పుణ్యం తోనో, వారి పిల్లలు ఇచ్చిన ధర్మోదకాలతోనో, శ్రాద్ధ కర్మల తోనో, పిండ ప్రదానాల తోనో ఉద్ధారం అయ్యే అవకాశం వుంది. అంతే తప్ప, పిల్లలు లేరని నరకం లేదు.

మనకు భగవద్భక్తి లేక, సాధన చేయక పోతే, దానికి తోడు పితరుల సద్గతి కోసం పాటుపడే పిల్లలు లేకపోతే, నరకమే. తన జ్ఞానం వల్లనే, తను చేసిన విహిత కార్యాల వల్లనే, సాధన వల్లనే 'సద్గతి'. అదే శాస్త్రం..

శాస్త్రం 12 రకాల పుత్రుల గురించి చర్చిస్తుంది..

పుత్రులు ఆరు రకాలు..

1. ఔరసుడు, 

2. దత్తకుడు, 

3. కృత్రిముడు, 

4. గూఢోత్పన్నుడు, 

5. అపవిధ్ధుడు, 

6. క్షేత్రజుడు..

వీరికి రాజ్యములో కానీ, ఆస్తిలో కానీ భాగం ఉంటుంది..

ఇంకొక రకమైన పుత్రులు, ఆరుగురు ఉన్నారు..

7. కానీనుడు, 

8. సహోఢుడు, 

9. క్రీతుడు, 

10. పౌనర్భవుడు, 

11. స్వయందత్తుడు, 

12. జ్ఞాతుడు..

వీరు కూడా పుత్ర సమానులే కానీ, వీరికి రాజ్యాధికారము కానీ, ఆస్తిలో భాగము కానీ వుండదు..

మనుమడు, కూతురు కొడుకు కూడా పుత్రుల లెక్కలోకి వస్తారు. అందుకే, మన తర్పణ విధులలో, ఇటు తండ్రి వైపు మూడు తరాల వారికీ, అటు తల్లి వైపు మూడు తరాల వారికీ పిండాలు పెడతాము, తర్పణాలు వదులుతాము..

కాబట్టి, ఎవరికీ కొడుకు లేడని బాధ పడవలసిన పనిలేదు. యోగ్యులైన కూతురు కొడుకులు తర్పణాలు విడిచినా, అవి ఆ తండ్రికి అందుతాయి..

తమకు వేరు లోకమున ఉత్తమ గతులు లభించుటకు పుత్రులు కావలయును అనుకుంటారు.. తమకు పుత్రులు కలగని వారు, అయ్యో, మాకు పుత్రులు కలుగ లేదు.. మాకు ఎట్లు ఉత్తమ గతులు కలుగును? అని అనుకుంటారు..

'కొడుకుల్ పుట్ట రటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై

కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్

వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్

చెడునే మోక్షపదం మపుత్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా'..

కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుమంది పుత్రులు కలిగిననూ, వారి మూలమున అతడు ఏ ఉత్తమ లోకములు పొంద గలిగాడు? బ్రహ్మచారిగనే యుండి, సంతతి యే లేకున్న శుకునకు దుర్గతి ఏమయినా కలిగిందా? కనుక పుత్రులు లేని వానికి మోక్ష పదము లభించక పోవడము వుండదు. పుత్రులు గల వారికి కూడా ఉత్తమ గతులుగానీ, మోక్షముగానీ సిధ్ధించక పోవచ్చును. పుత్రులు లేని వారికి అవి రెండూ సిద్దించనూ వచ్చును..

కావున, కొడుకులు లేరని ఎవరూ బాధ పడకూడదు. మన పుణ్యం మనమే సంపాదించు కోవాలి. మన ఉద్ధారణ కోసం మనమే పాటు పడాలి. మనకు ఆ ఈశ్వరుని దయ వలన ఉత్తమ సాధన చేసే అవకాశం సద్వినియోగమై, మన ఉత్తమ గతులను మనమే సాధించుకోవాలి..

శ్రీ కాళహస్తీశ్వరా! ఈశ్వరా!

[ అరుణాచలం గురించి ఆశ్చర్యకర నిజాలు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/PRr5MjGOg_g ]

Post Link: https://www.youtube.com/post/UgxEa9tZaeOKFXLNE0h4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes