పితృ దేవతలను పునరావృత రహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించే రాజమార్గం!


పితృ దేవతలను పునరావృత రహిత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించే రాజమార్గం!

బ్రహ్మ సృష్టి కర్త అయితే, శివుడు లయకారుడు. బోళాశంకరుడిగా, అసురులకు సైతం వరాలు ప్రసాదించే ఈశ్వరుడు, ముక్కంటిగా ముల్లోకాలనూ లయంజేయగలడు. రుద్రుడిగా, సకల ప్రాణులనూ వణికించే శివుడి ఆగ్రహానికి లోనైన బ్రహ్మ, తన శిరస్సును కోల్పోయాడు. పంచముఖుడైన బ్రహ్మ, చతుర్ముఖుడిగా ఎలా మారాడు? బ్రహ్మపై ఈశ్వరుడి కోపాగ్నికి గల కారణాలేంటి? ఏ సందర్భంలో బ్రహ్మ తన అయిదవ ముఖాన్ని కొల్పోయాడు? అనే విషయాలపై, పొంతన లేని అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని ఆధారాలను బట్టీ, మరికొన్ని పురాణాలను బట్టీ వెలుగులోకి వచ్చాయి. వాటిల్లో, బదరీ నారాయణుడి ఆలయ సమీపంలో గల, బ్రహ్మ కపాల క్షేత్రం వెనుక దాగిన ఒక ఆసక్తికర గాథ గురించి, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/kBQMLBnXlos ]

శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు, పురోహితుడైన బ్రహ్మ పంచముఖుడు. నాలుగు ముఖాలతో మంత్రోఛ్ఛారణ చేస్తున్నాడు.. కానీ, ఆయన ఊర్ధ్వ ముఖం, పార్వతీ దేవి వర్చస్సుని చూస్తుండిపోయింది. ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుధ్ధి చెప్పాలని, చేయిచాచి ఒక దెబ్బ వేశాడు.. మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా.! దాని ప్రభావనికి బ్రహ్మ ఊర్ద్వ ముఖం తెగిపోయింది. కానీ, క్రిందపడలేదు.. శివుడి అరచేతికి అతుక్కుపోయింది. ఎంత విదిలించినా, అది ఆయన చేతిని వదలలేదు.. క్రమక్రమంగా ఎండి, చివరికది, కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు. దానికి ఆది దేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే, అది సరాసరి బ్రహ్మ హత్యగా పరిణమించి, ఆ పాపం, అంతటి మహాదేవుడుకీ అంటింది. జగద్గురువూ, మహాతపశ్వీ అయిన ఆయనకూ, ఆ పాప ఫలం తప్పలేదు.

దేవతలందరినీ పిలిచి, నిస్సంకోచంగా జరిగింది చెప్పి, తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమేమిటో సూచించమన్నాడు. 'దేవాది దేవా! పరమ జ్ఞానులు.. మీకు తెలియని ధర్మం లేదు.. ఈ జగత్తును నడిపిస్తున్న వారు. శాసించ గల వారు. అయినా, మాపై క్రుపతో, ఒక సలహా ఇవ్వమని కోరారు. కనుక, మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము.. ఈ కపాలాన్నే భిక్ష పాత్రగా భావించి, ఇంటింటికీ తిరుగుతూ, ప్రతిచోటా మీ పాపమేమిటో చెప్పుకుని, భిక్షమడుగుతూ వెళ్ళండి. కొంత కాలానికి ఆ పాపం తరిగిపోయి, ఈ కపాలం రాలిపోవచ్చు.. అన్నారు దేవతలు.

పరమశివుడికి అది ఉచితమనిపించింది. భిక్షువుగా మారి, ముల్లోకాలు తిరుగుతూ.. మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాల్లో, తాను పూర్వం కేదారేశ్వరుడిగా అవతరించి ఉన్నాడు. అందుకు సంతసించిన మామ హిమవంతుడు, ఆ ప్రాంతాల్లోని శిఖరాలనూ, నదులనూ, ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు, శివుడి దగ్గరకు వచ్చి, ‘పరమశివా, నీ ఆధీనంలో ఉన్న శిఖరాలలో, ఈ బదరీవనంతో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వగలవా?’ అని అడిగాడు.

నారాయణుడంతటివాడు అడిగితే, తానెలా ఇవ్వకుండా ఉండగలడు? పరమ సంతోషంతో, ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు శివుడు. అప్పటినుంచి, శ్రీమన్నారాయణుడు బదరీనారాయణుడై అక్కడ వెలిశాడు. ఆ తరువాత శివుడు, ఆయన దగ్గరకే భిక్షకు బయలుదేరాడు. ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు. 'పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు. వాస్తవంగా ఇది ఆయన ఇల్లు. ఆయన తన ఇంటికే భిక్షకై వస్తున్నాడంటే - అది ఆ మహాయోగి వైరాగ్యానికి పరాకాష్ట. ఈ అద్భుత సన్నివేశాన్ని, జగద్వితంగా మార్చాలి. ఇది శివక్షేత్రం. ఇందులో నేను, విష్ణువును ఉన్నాను. ఇక్కడికి శివుడు బ్రహ్మ కపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వ ముఖానిది. అంటే, అది అధోలోకాలనూ, ఊర్ధ్వ లోకాలనూ అనుసంధానంజేసే ముఖం. చిరకాల శివహస్త స్పర్శవల్ల, దానిలోని దుర్భావనలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం. దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి. దానికి తోడు, నా శక్తీ, శివ శక్తీ ఇక్కడ కలిసి ఉన్నాయి.' అని భావిస్తూ, విష్ణువు శివుడికి ఎదురేగి, ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే! ఆ కపాలం కాస్తా ఊడి క్రిందపడి, శిలామయ శివలింగ రూపంగా మారిపోయింది.

అప్పటి నుంచీ, బదరీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న, శివలింగ రూప ధారియైన బ్రహ్మకపాలం, మహాక్షేత్రమైంది. తమ పిత్రు దేవతలను పునరావ్రుత రహిత, శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునే వారికి, రాజమార్గమై నిలచింది! ఈ క్షేత్రం వెనుక అనేక రకాల గాథలున్నప్పటికీ, అంతరార్థం మాత్రం ఒకటే. సర్వ లోకాలనూ సృష్టించే దేవుడైనా సరే, అహంకారంతో, కామాంధకారంతో ప్రవర్తిస్తే, శిక్ష తప్పదు. అదే విధంగా ఆగ్రహంతో చేసే పనులకూ, తప్పక ఫలితం అనుభవించాల్సిందే అని, బ్రహ్మ, ఈశ్వరులు, ఈ క్షేత్రం వెనుకవున్న గాథల ద్వారా తెలియజేశారు..

Link: https://www.youtube.com/post/Ugzx9Y7EorR3hC9HeqJ4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes