హనుమంతుడు పంచముఖాలను ఎందుకు ధరించాడు? Panchamukha Hanuman


హనుమంతుడు పంచముఖాలను ఎందుకు ధరించాడు? 

'రామ' శబ్దాన్ని వింటే, పరవశించిపోతాడు. తలచినంత మాత్రాన, సకల కష్టాలనూ చిటికెలో రూపుమాపేవాడు, ఆంజనీ సుతుడు. కొలచినంత మాత్రాన, సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు, ఆ హనుమంతుడు. మనుమంతుని, పంచముఖుని రూపంలో ఆరాధించడం, ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ, ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు! శ్రీరాముని రక్షించడం కోసం, ఆంజనేయుడు పంచ ముఖునిగా మారిన వైనం, రామాయణంలోనే ప్రస్తావించబడి ఉంది. ఆనాటి నుంచే, ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.

[ ఔరంగజేబుని హడలెత్తించి పరుగెత్తించిన ఆంజనేయస్వామి!  = https://youtu.be/pmdh0JhWyMY ]

మైరావణ వృత్తాంతం:

రామాయణంలో రావణుడు సీతమ్మను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం విఫలమవ్వడంతో, సీతను చేజిక్కించుకునేందుకు, రామ రావణుల మధ్య భీకర సంగ్రామం మొదలయ్యింది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ, తన సైన్యం పలుచబడిపోవడాన్ని చూసి, ఆశ్చర్యపోయాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో, బెంబేలుపడిపోయాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరాడు. మైరావణుడి నుంచి రామ లక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు, వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా, అందరి కళ్లూగప్పి, రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోయాడు మైరావణుడు.

[ అర్జునుడి రథంపై హనుమంతుడు ఉండడానికి గల కారణం! = https://youtu.be/F3pdXaWX7ps ]

హనుమంతుని పయనం: 

రామలక్ష్మణులను వెతుక్కుంటూ, తాను కూడా పాతాళానికి చేరుకున్నాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడనే వింతజీవిని చూశాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారనీ, తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని, ఓ జలకన్య గ్రహించడం వల్ల జనించిన తన కుమారుడేననీ, తెలుసింది. అయినా, విద్యుక్తధర్మాన్ని అనుసరించి, మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో, హనుమంతునిదే పైచేయి అయ్యింది.

[ హనుమంతుడు బ్రహ్మచారా? వివాహితుడా? = https://youtu.be/6wOkEw-wpsw ]

మైరావణుని సంహారం:

మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు, అతనితో యుద్ధాన్ని ఆరంభించాడు. కానీ, ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప, మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకున్నాడు. మైరావణుని పురంలో, ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితేనేగానీ, అతనికి చావు మూడదని తెలుసింది. అందుకోసం, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ ముఖం.. ఇలా అయిదు దిక్కులా, అయిదు ముఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదించాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో, ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి, మైరావణుని అంతం చేశాడు. అతనే పంచముఖాంజనేయుడు..

[ ఆవేశంలో ఉన్న హనుమకు సీతమ్మ చెప్పిన కథ! = https://youtu.be/YK8QjVW2kc0 ]

పంచముఖాల ప్రాశస్త్యం:

అయిదు అనే సంఖ్య, పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో, మనిషి ఈ ప్రపంచంలో తన మనుగడను సాగిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో, ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది? స్వామివారి పంచముఖాలలో, ఒక్కో మోముదీ, ఒక్కో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ.. 

ఆ అయిదు ముఖాలూ, తన భక్తులకు అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్నీ, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్ట సిద్ధినీ కలుగజేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే, రాఘవేంద్ర స్వామి సైతం, ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.

జై శ్రీ రాం! జై హనుమాన్!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes