ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం (మార్గశిర లక్ష్మీవార వ్రతం)


ఐశ్వర్యాన్నిచ్చే ఐదువారాల అద్భుత వ్రతం (మార్గశిర లక్ష్మీవార వ్రతం)

హేమంతం వచ్చిందంటే చాలు కోటి శుభాల మార్గశీర్షం వచ్చేసినట్టే. లక్ష్మీకళతో లోగిళ్లన్నీ కళకళలాడినట్టే. ఎటు విన్నా ‘లక్ష్మీ నమస్తుభ్యం..’ ఎటు చూసినా ‘నమస్తేస్తు మహామాయే..’ అంటూ ఆ అమ్మను ఆర్తితో స్తుతించడం, పూజించడం వీనుల విందుగా వినిపిస్తూ, నయనారవిందం చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం ఆయన సతీమణి మహాలక్ష్మికీ మక్కువైనదే!

ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుంచి ఐదు వారాలపాటు తనను నియమనిష్ఠలతో కొలిచినవారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనకమహాలక్ష్మి. మార్గశిరమాసంలో మహాలక్ష్మిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన పదకొండు మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మీవైభవం సమకూరుతుంది. వారి మార్గం విజయపథమై విరాజిల్లుతుంది. ఆ వ్రత విధానం అందరి కోసం..

లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు పొందాలనుకునేవారంతా మార్గశిరంలో ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారికి దగ్గరవుతుంటారు. ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోదగింది లక్ష్మీవార వ్రతమే. దీన్నే కొందరు గురువార లక్ష్మీపూజ అని, లక్ష్మీదేవి నోము అని పిలుస్తారు. మార్గశిర లక్ష్మీవార వ్రతం, ఈప్సితాలను ఈడేర్చుకునేందుకు మహిళలకు, లోకానికి దక్కిన మహోత్కృష్టమైన వరం.

ఐదువారాల అద్భుత వ్రతం..

మార్గశిర లక్ష్మీపూజ ఐదు గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఈ నెలలో గనుక నాలుగే లక్ష్మీవారాలు వస్తే, ఐదవ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు కూడా నోము నోచుకోవాలి.

వ్రతవిధానం:

ముందుగా ప్రాతఃకాలాన నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దాలి. లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యప్పిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. మహాగణపతి పూజతో వ్రతం మొదలవుతుంది. విఘ్నేశ్వరార్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. ‘హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం’ అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులు, కర్పూరనీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి.

‘ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్’ అంటూ, లక్ష్మీగాయత్రి పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి.

అనంతరం ‘సహస్రదళ పద్మస్థాం పద్మనాభ ప్రియాం సతీం’ అనే సిద్ధలక్ష్మీ కవచాన్ని, సభక్తికంగా చదువుకోవాలి. తరువాత అష్టోత్తర నామావళి పూజ చేసి, మహా నైవేద్యం సమర్పించాలి. నైవేద్యానంతరం, లక్ష్మీవారవ్రత కథ చెప్పుకుని, అక్షతలు శిరసున ధరించాలి. చివరగా క్షమా ప్రార్థన చేయాలి.

అమ్మవారికి సమర్పించే మహా నైవేద్యం విషయంలో, కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెబుతారు.

తొలి గురువారం అమ్మవారు పుట్టినవారంగా ప్రఖ్యాతమైంది. కాబట్టి ఈ రోజు నోము సందర్భంగా పులగం నివేదన చేయాలి.

రెండవవారం అట్లు, తిమ్మనం.

మూడోవారం అప్పాలు, పరమాన్నము.

నాలుగోవారం చిత్రాన్నము గారెలు నైవేద్యం పెట్టాలి.

ఐదోవారం నాడు అమ్మవారికి పూర్ణం బూరెలను నివేదించాలి.

ఆ రోజు ఐదుగురు ముత్తయిదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి, వారి ఆశీస్సులు పొందాలి. దీంతో, మార్గశిర లక్ష్మీవ్రతం పూర్తయినట్టే. మంగళ గౌరీ వ్రతంలాగ పూజ పూర్తయ్యాక, ఉద్యాపన చెప్పే క్రియ, ఈ నోములో ఉండదు. ఎందుకంటే, మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే, ఈ పద్ధతిని పాటించాలనేది, పండితుల ఉవాచ.

నియమ నిష్ఠలు కీలకం:

గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి, ఈ నోము నోచేస్త్రీలు, ఆయా లక్ష్మీవారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలి సంధ్య, మలి సంధ్య నిదుర పోకూడదు. కల్లలాడకూడదు. నియమనిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట, లేమి అనే శబ్దం పొడసూపదు. ఐశ్వర్య దేవత వరాలు కురిపించి, విజయాలను చేకూరుస్తుంది.

ఒక్క గురువారాలలోనే కాకుండా ఈ మాసంలోని ప్రతిరోజూ లక్ష్మిని పూజిస్తే విష్ణుసతి దీవెనలతో పది కాలాలు పచ్చగా వర్ధిల్ల వచ్చని, పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి పూలు, పండ్లు, సువాసనలిచ్చే అగరుధూపం, పరిమళ ద్రవ్యాలు ప్రీతికరం. వీటితో ఆమె అనుగ్రహాన్ని అవలీలగా పొందవచ్చు. ఈ సువాసనలతో మన ఇంటిని లక్ష్మీ ప్రసన్నంగా మార్చుకోవచ్చు.

మార్గశిర లక్ష్మీవార వ్రత కధ:

పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది. ఆసుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల. ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు. ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దొలిపించి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా, దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు. ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను. మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకువెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకెళ్లి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున మూటని పెట్టి నీరు తాగి వచ్చేసరికి వాటిని ఎవరో ఎత్తుకుపోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పేడు. తల్లి జరిగినదనికి దరిద్రం మనకి ఎలా ఎందుకు ప్రాప్తి చెందిందో అని బాధపడెను. మళ్ళీ కొన్నాళ్ళకి కొడుకును పంపుతూ, ఈ సారి అయినా జాగ్రత్త గా తీసుకురమ్మని చెప్పెను. అక్కకి పరిస్థితి ఇదివరకు లానే ఉంది అని చెప్పెను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి దాని నిండా వరహాల నింపి ఆ పండు అమ్మ కి ఇమ్మని చెప్పి ఇచ్చింది. సరే అని తీసుకొస్తు సాయం సమయం లో ఒక చెరువు వద్ద కి వచ్చి దాన్ని గట్టు మీద పెట్టి సాయం సంధ్య వందనం చేస్తున్నాడు. ఇంతలో ఒక బాటసారి వచ్చి పండు బాగుందని తీసుకుపోయాడు.

ఆ కుర్రాడు గట్టు మీద కొచ్చి పండు వెతగగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళేడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్ళకి తల్లి పిల్లలని ఇంటిదగ్గర ఉంచి,  కూతురు దగ్గరకి వెళ్లెను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రం తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీ వారం నోము నోచిన ఐశ్వరం వచ్చునని తలచెను. అమ్మ ఈ రోజు మార్గశిర లక్ష్మీ వారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. ఆమె కూడా అలానే నేను ఏమైనా చిన్న పిల్లనా ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకి చల్ది అన్నం కలుపుతూ నోటిలో ఒక ముద్ద వేసుకుంది. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్ వ్రతం చేసుకుందాం అన్నది. అప్పుడు జరిగింది తల్లి చెప్పింది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది. రెండవ వారం అమ్మ వ్రతం చేసుకుందాం అన్నది అప్పుడు పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను రాసుకుంది. ఆ వారం కూడా వ్రతం వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈ వారం అయిన జాగ్రత్త గా ఉండమని చెప్పింది. పిల్లలకి తలదువ్వుతూ తాను దువ్వుకుంది. ఆ వారం కూడా వ్రతం కుదరలేదు. కూతురు మాత్రమే చేసుకుంది. నాలుగోవారం ఈ సారైనా జాగ్రత్తగా ఉండమని తల్లికి చెప్పి, తల్లి ఈ పని చేయకుండా ఉండటానికి, ఒక గోతిలో కూర్చోపెట్టింది. పని అయిన తరువాత అమ్మ ని తీసుకొచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా, తల్లి పిల్లలు అరటిపండు తిని, నేను కూర్చున్న చోట అరటి తోలు వేశారు. నేను తోచక అది తిన్నానని చెప్పింది. అయ్యో అని తలచి, కుతురు పూజ చేసుకొని, ఐదవ వారం మార్గశిర లక్ష్మీవారం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగుకి కట్టుకొని, పని పూర్తి చేసుకొని, తల్లితో స్నానం చేయంచి, వ్రతం చేయంచింది.

పూర్ణాలు, కుడుములు తల్లితో నైవేద్యం పెట్టించింది.కానీ మహాలక్ష్మీ దూరం గా వెళ్లి పోయింది. ఏమిటమ్మ.. అలా వెళ్లిపోతున్నావు? అని అడుగగా.. నీ చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటుంటే, మీ అమ్మ చీపురుతో కొట్టింది. అందుకే వెళ్లిపోతున్నానని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిందానికి క్షమించమని ప్రార్ధించింది. మళ్ళీ నీ తల్లితొ వ్రతం చేయంచమని, అదృశం అయింది మహాలక్ష్మి. సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మానం, మూడవ వారం అప్పాలు, పరవణ్ణం, నాలుగోవారం చిత్రన్నాం, గారెలు, పుష్య మాసం లో మొదటివారంలో పూర్ణ కుడుములు వడ్డించి, తల్లితో నోము చేయంచింది. కథా అక్షింతలు తలమీద వేసుకున్నారు. అప్పటినుండి, ఆమెకు సకల సంపదలు కలిగి, అంత్యమందున విష్ణు లోకానికి వెళ్లెను. కథలో లోపమైనను వ్రాతలోపం కారాదు. భక్తి తప్పినను, ఫలం తప్పదు.

Link: https://www.youtube.com/post/UgxqSHLGUYW4vy088TZ4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes