భోగి పండ్లు! Bhogi Pallu


భోగి పండ్లు!

రేగి పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు, బదరీ వనంలో తపస్సు చేశారు! అక్కడ తపస్సు చేసుకుంటూ, వాళ్ళు రోజూ చుట్టు ప్రక్కల వున్న చెట్ల నుంచి, ఒక్క రేగి పండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగి పళ్ళని తింటూ, ఆ ప్రదేశాలనీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి, ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

[ భోగి రోజు ఇలా చేస్తే ఇంటి నిండా సిరులే! : https://youtu.be/jkmkEU3i8yg ]

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి, సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయిగనుక, రేగి పళ్ళను ఎవరు వాడినా, సిరిసంపదలూ, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళు పోసి, ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు, ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.. రేగి పండు భారత ఇతిహాసంలో, భారత నాగరికతలో, పూజలలోనూ పాలు పంచుకునే అతి కొద్ది పండ్లలో, రేగి పండు ఒకటి. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది, ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు భోగి పండ్లు పోయాలని అంటుంటారు.. అవి కూడ రేగి పండ్లే.

సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి, ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే, భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో, ధన, ధాన్య లక్ష్ములు కొలువై ఉంటారుగనుక, వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు..

మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను, భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగి రోజున తెల్లవారక ముందే, గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో, భోగిమంటలు వేస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్క ముక్కలన్నీ తీసుకొచ్చి, ఈ మంటల్లో వేస్తారు.

భోగి మంటల పరమార్థం ఏమిటంటే.. ఆ మంటల ద్వారా చలిని పార ద్రోలటమే గాకుండా.. ఆ రోజు నుంచి, జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే, మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలనీ, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమనీ సూచిస్తుంటారు.

ఇక భోగి రోజు సాయంత్రం పూట, అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే, పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో, పిల్లలు వారి దగ్గర ఉండే అన్ని రకాల ఆట వస్తువులనూ ఉంచి, సంతోషిస్తారు. అలాగే, ఈ సందర్భంగా తల్లులు, పేరంటాన్ని ఏర్పాటు చేసి, ఇరుగుపొరుగు మహిళలకు పసుపు, కుంకుమలు అందిస్తారు.

దీనికి ప్రతిగా, వారంతా రేగిపళ్లూ, పువ్వులూ, రాగి నాణాలనూ చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు.

రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడు రోజుల పాటు, కొత్త బట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండి వంటలతో విందు చేసుకుంటారు.

భోగిపళ్ళు: భోగి పండ్లు అంటే రేగిపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగి పండ్లతో నాణేలను కలిపి, పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి, ఆరోగ్యం కలగాలనే సంకేతంతో, భోగిపండ్లు పోస్తారు.

Link: https://www.youtube.com/post/UgzeAnIz3wM0RD8XX014AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes