లక్ష్మీదేవి జయంతి!


రేపు 28/03/2021 లక్ష్మీదేవి జయంతి!

ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం. ప్రతి మానవుడూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివశించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకుని, ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని, సంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాలల్లో లక్ష్మీదేవి జనన గాథల్ని గురించి తెలుసుకుందాం.

[ మూడు యుగాల హోళీ అద్భుత చరిత్ర = https://youtu.be/X7RDDA-ApRw ]

క్షీరసాగర మధనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు, అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనపడే కథనమిది.

విష్ణుపురాణంలో వేరొక గాథ కనపడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భ్రుగు మహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ 'ఖ్యాతి చేసిన తఫః ఫలమే' లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది.

లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి, పురాణాలలో అనేకచోట్ల అనేక కథలున్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు, కనకధారాస్తవం పఠించాడనీ, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలున్నాయి.

అపరిశుభ్రంగా ఉండే ఇళ్ళలోనూ, ప్రదేశాలలోనూ, లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా, ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున, కేవలం భక్తి శ్రద్దలతో పూజచేసి సరిపెట్టుకోకుండా, నిత్యం మనం ఉండే ఇళ్ళనూ, పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకుందాం. లక్ష్మీదేవి కృపకు పాత్రులమవుదాం.

లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో, ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు, పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు, ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించిందని చెపుతారు.

జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుండి, తామస మన్వంతరంలో భూమినుండి, రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి, చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లడవుతోంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజైన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీజయంతిని మనం జరుపుకుంటున్నాం. వైవస్వతంలో శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది.

పూర్వం ఒకసారి, దూర్వాస మహా ముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహూకరించగా, దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపజేశాడు. ఆ ఏనుగు ఆ మాలను కింద పడేసి, కాళ్ళతో తొక్కి ముక్కలుజేసింది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై, 'నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక' అని శపించాడు. శాప ఫలితంగా, స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోయింది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలుజేశారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు.

దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, జరిగిన వృత్తాంతాన్ని తెలిపి, శరణువేడారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటపెట్టుకుని విష్ణువువద్దకు వెళ్ళి, పరిస్థితిని వివరించాడు. క్షీరసాగర మధనం ద్వారా అమృతాన్ని ఉద్బవింపచేసి, ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచించాడు.

క్షీర సాగర మధనంలో ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా, తరువాత సురభి అనే కామధేనువు, ఉచ్ఛ్వైశ్రవం అనే అశ్వం, పిమ్మట ఐరావతం, కల్పవృక్షం, వీటన్నింటి తరువాత, క్షీరాబ్ధి నుంచి ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో, శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో, శ్రీ మహాలక్ష్మీ జననం వెనుక ఉన్న గాధ. ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా, శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తుంటాం.

భక్తి శ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరి సంపదలతో పాటు, కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా జయం లభిస్తుంది. బలము, మేధస్సు, ఆరోగ్యం ఇత్యాదివి సంప్రాప్తిస్తాయి.

Link: https://www.youtube.com/post/UgyhKXmmqbXs59W6gTt4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes