అష్టాక్షరీ మంత్ర మహిమ!


అష్టాక్షరీ మంత్ర మహిమ!

'ఓం నమో నారాయణాయ' అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం. అనంత పాప రాశిని ద్వంసం చేయగల శక్తి కలిగినది. ఇట్టి అష్టాక్షరీ మంత్ర అధిష్టాన పురుషోత్తముడే, శ్రీమన్నారాయణుడు. స్థితి కారకుడై, అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు, లక్ష్మీనారాయణునిగా.. విధ్య, జ్ఞానము ప్రసాదించునపుడు, లక్ష్మీ హయగ్రీవునిగా.. ఆరోగ్య ప్రదాతగా నిలిచిన సమయాన, ధన్వంతరిగా.. సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా.. సమస్త మానసిక రుగ్మతలూ తొలగించు లక్ష్మీ సుదర్శనునిగా.. భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తాత్రేయునిగా.. సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా, భక్తులకు సుఖ శాంతులను ప్రసాదిస్తున్నాడు..

[ మూడు యుగాల హోళీ అద్భుత చరిత్ర = https://youtu.be/X7RDDA-ApRw ]

మానవాళిని తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి, ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం, పదిహేడవ అధ్యాయం. వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి, ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసార బంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం, 'ఓం నమో నారాయణాయ' అనేది. ఇది అష్టాక్షరి. అంటే, ఎనిమిది అక్షరాలతో కూడుకుని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకీ, ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే, ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు, శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. అలాగే, పవిత్ర నదీ ప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర, శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకుని అష్టాక్షరిని జపించటం మేలు.

అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి, ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది.. అవి వరుసగా..

ఓంకారం శుక్ల (తెలుపు) వర్ణం,

నకారం రక్త (ఎరుపు) వర్ణం,

మో అనే అక్షరం కృష్ణ (నలుపు) వర్ణం,

నా అనే అక్షరం ఎర్రగానూ,

రా అనే అక్షరం కుంకుమ రంగులోనూ,

య అనే అక్షరం పసుపు పచ్చని రంగులోనూ,

ణా అనే అక్షరం కాటుక రంగులోనూ ఉంటుంది..

'ఓం నమో నారాయణాయ' అనే ఈ మంత్రం, ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ, అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో, చివరకు కనిపించటం, సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. ఈ మంత్ర ప్రభావం వల్ల, స్వర్గ, మోక్ష ఫలాలతోపాటు, కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. దీనిలో సకల వేదార్థాలూ నిండి ఉన్నాయని, పండితులు విశ్లేషించి చెబుతుంటారు. ఈ మంత్రాన్ని స్నానం చేసి, శుచి అయిన తర్వాత, పవిత్ర ప్రదేశంలో కూర్చుని జపించాలి.

సర్వకాల సర్వావస్థలలోనూ, తాను పవిత్రంగా ఉన్నాననుకున్నప్పుడు, భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడూ, పని అయిన తర్వాతా, దీన్ని జపించటం మేలు. ప్రతి నెలలోనూ, ద్వాదశి నాడు శుచి అయి, 'ఓం నమో నారాయణాయ' అనే ఈ మంత్రాన్ని ఏకాగ్ర చిత్తంతో, 108 సార్లు జపించాలి. అలా జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. స్వామిని గంధ పుష్పాలతో పూజించి, ఈ మంత్రాన్ని జపిస్తే, పాపాలు హరించుకు పోతాయి. అష్టాక్షరీ మంత్ర జపంలో, మొదటి లక్ష పూర్తికాగానే, ఆత్మశుద్ధి కలుగుతుంది. రెండవ లక్ష పూర్తి అయ్యేసరికి, మనశ్శుద్ధీ, మూడవ లక్ష పూర్తి అయినప్పుడు, స్వర్గలోక అర్హత, నాలుగవ లక్ష పూర్తికాగానే, శ్రీహరి సామీప్య స్థితికి అర్హతలు లభిస్తాయి. అయిదు లక్షలసార్లు, ఈ మంత్ర జపం చేసిన వారికి, నిర్మల జ్ఞానం కలుగుతుంది. ఆరవ లక్షతో, విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, ఏడవ లక్షతో, స్వస్వరూప జ్ఞానం, ఎనిమిదవ లక్షతో, ముక్తీ లభిస్తాయి. నిత్యజీవితంలో చేసుకునే పనులు చేసుకుంటూనే, అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు.

నిత్యం ఈ మంత్ర జపం చేసేవారికి, దుస్వప్నాలూ, పిశాచాలూ, సర్పాలూ, బ్రహ్మరాక్షసులూ, దొంగలూ, మోసగాళ్లూ, మనో వ్యాధులూ, శారీరక వ్యాధుల వల్లా బాధలుండవు. ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరీ మంత్రం, ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులూ, మునులూ, పితృ దేవతలూ, దేవతలూ, సిద్ధులూ, రాక్షసులూ ఈ మంత్రాన్ని జపించి, పరమ సిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. ప్రాణాన్ని విడిచే సమయంలో, ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా, వైకుంఠం లభిస్తుంది. వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు, ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. ఒక్కోసారి శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులూ, పూజలూ వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో, ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ తెలియనప్పుడు, 'ఓం నమో నారాయణాయ' అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూటఎనిమిది సార్లు జపించినా, ఆయా అవతారాల పూజా ఫలితం దక్కుతుంది, అని నరసింహ పురాణంలో, సాక్షాత్తు వ్యాస భగవానుడే, తన కుమారుడైన శుకయోగికి వివరించి చెప్పడంతో, అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది..

Link: https://www.youtube.com/post/UgyJKCwZ75slzMRdNat4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes