నరదృష్టి నివారణ! Drishti Dosha


నరదృష్టి నివారణ!

నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా పగులుతుందని సామెత. ఈ దృష్టి దోషం కేవలం మనుషులకే కాదు, గృహాలకూ, వస్తువులకూ, వాహనాలకూ, దుకాణాలకూ, వ్యాపారానికీ, చివరికి కాపురానికి కూడా తగులుతుంది. దృష్టి కంటి చూపు వల్ల వస్తుంది. అది ప్రేమాభిమానాలతో కావచ్చు, ఈర్షా ద్వేషాల వల్ల కావచ్చు. అందుకే, చివర్లో కొద్దిగా అన్నం ఉంచి, బిడ్డకు దిష్టి తీసేయడం సంప్రదాయంగా వస్తోంది. దృష్టి తగిలితే పశువులు కూడా పాలు ఇవ్వవు. పెళ్లి జరిగాక కొత్తజంట ఇంట్లోకి అడుగు పెట్టేప్పుడు, ఎర్ర రంగు నీటితో దృష్టి తీయడం సంప్రదాయంగా వస్తోంది. పెళ్లికి వచ్చిన అందరి దృష్టీ వధూవరులపైనే పడుతుంది. కాబట్టి దృష్టి తగల కుండా ఎర్ర నీళ్లతో దృష్టి తీస్తారు.

[ వాల్మీకి రామాయణ రచన!  = ఈ వీడియో చూడండి: https://youtu.be/ceNwjWyMyeg ]

మనం చాలా చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ఉంటే, దృష్టి దోషాలన్నీ తొలగిపోయి, సిరి సంపదలు కలుగుతాయి. అవి ఏమిటంటే, దాదాపుగా మన ఇంటి వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో, వారందరి కళ్ళల్లో ఉండేటటువంటి దృష్టి దోషం, మన ఇంటి మీద పడుతుంది. అందుకే, మనం ఇంటికి దృష్టి తీస్తూ ఉండాలి.

అసలు దృష్టి అనేది ఎప్పుడు తీయాలి?

ప్రతీ అమావాస్య రోజునా ఒక గుమ్మడికాయ.. అంటే, కూర వండుకునే గుమ్మడికాయ తీసుకు వచ్చి, దాని మీద ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి, ఇంటి ముందు నిలబడి మూడు సార్లు సవ్యదిశాగా దృష్టి తీసి, మూడు సార్లు అపసవ్య దిశగా దృష్టి తీయాలి. అలా దృష్టి తీసిన తరువాత, వెలుగుతూ ఉన్న కర్పూరాన్ని దూరంగా పారేసి, ఇంటి గడపకు ముందుగానీ, గేటు ముందుగానీ, గుమ్మడికాయను పగలగొట్టి, దానిలో కొంచం పసుపు, కుంకుమ వేసి నమస్కారం చేసుకుని, కాళ్ళు చేతులు కడుక్కుని, కళ్ళు తుడుచుకుని, కుడి కాలు లోపలకి పెట్టి, ఇంట్లోకి వెళ్ళాలి. ఇదంతా, అమావాస్య రోజున ఉదయాన్నే చేయాలి. తరువాత రోజు ఉదయం, ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి.

అలాగే, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో, ఒక నిమ్మకాయను తీసుకుని, దానిని ఇంటి గడప మీద పెట్టి కత్తితో రెండు ముక్కలుగా కోసి, కొంచం పసుపు, కుంకుమ తీసుకుని ఆ ముక్కలకు వేసి, గుమ్మానికి రెండువైపులా అలంకరిస్తే, ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోయి, నరఘోష, నరపీడ, నరశాపం, నరదృష్టి, నకారాత్మక శక్తులన్నీ తొలగిపోయి, ఇంట్లోకి సిరిసంపదలు వస్తాయని పెద్దలు చెబుతారు. కాబట్టి, ఈ పరిహారాన్ని జాగ్రత్తగా చేసుకుంటే, మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగి పోతాయి.

అమావాస్య రోజున ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం వల్ల, దృష్టిదోషం నుంచి తప్పించుకోవచ్చు.

మనమే కాదు, పక్కవారు కూడా సుఖంగా ఉండాలని కోరుకోవడం వల్ల సత్ఫలితా లెన్నో సిద్ధిస్తాయి. అవతలివారు చెడిపోవాలని కోరుకోవడం వల్ల, వారితోపాటు మనకు కూడా ఎన్నో కష్టాలు చుట్టుకుంటాయి. కాబట్టి, 'సర్వేజనాః సుఖినోభవంతు' అని కోరుకుందాం.

Link: https://www.youtube.com/post/UgztksVkPnC1vzvf_pl4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes