మహాశివరాత్రి వ్రత మాహాత్మ్యం! Shiva Ratri


మహాశివరాత్రి వ్రత మాహాత్మ్యం!

మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో, ఓ వ్రతంలా చేసుకోవటం, పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన, నిరంతరం శివుడుంటూ, చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి, ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రి నాడే కాక, ఈ వ్రతాన్ని సంవత్సరంలో, ప్రతి మాసశివరాత్రి నాడూ చేసి, ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి, అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తీ, ముక్తీ సొంతమవుతాయి. ఇంతటి పుణ్య ఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తూ ఆ పరమశివుడే.

[ నందీశ్వరుడు చెప్పిన శివరాత్రి మాహాత్మ్యం! = https://youtu.be/YPCDlvLz5Sw ]

ఓసారి బ్రహ్మ, విష్ణువు, పార్వతీ నేరుగా శివుడినే, ఏ వ్రతం చేస్తే మానవులకు, శివుడు భక్తినీ, ముక్తినీ కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడా పరమేశ్వరుడు, చేసిన వారికే కాక, చూసిన వారికీ, విన్నవారికీ కూడా, పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించీ, దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించీ తెలియజెప్పాడు. భక్తినీ, ముక్తినీ మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు, చాలా ఉన్నాయి.

జాబాల శ్రుతిలో రుషులు, పది శైవ వ్రతాలను గురించి చెప్పారు. శివ పూజ, రుద్ర జపం, శివాలయంలో ఉపవాసం, వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలూ, అష్టమి తిథితో కూడిన సోమవారం, కృష్ణ పక్షం నాటి చతుర్ధశీ, శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే, శివరాత్రి వ్రతం, అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి, ఈ వ్రతాన్ని చెయ్యటం మంచిది. ధర్మ సాధనలన్నిటిలో ఉత్తమమైనదని, దీనికి పేరు. ఏ భేదమూ లేకుండా, సర్వ వర్ణాలవారూ, అన్ని ఆశ్రమాలవారూ, స్త్రీలూ, పిల్లలూ, ఒకరనేమిటి.. దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు.

మాఘమాసం కృష్ణపక్షంలో, ఈ వ్రతం చేయటం శ్రేష్ఠం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి. శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే, శివుడి మీదనే మనస్సును లగ్నంచేయాలి. శుభ్రంగా స్నానం చేశాక, శివాలయానికి వెళ్ళి, శివపూజను చేసి, సంకల్పం చెప్పుకుని, పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి, సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలను, అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం, లోపల, బయట, అంతా పరిశుభ్ర వస్త్రధారణలతో, శివపూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం, పూజను చేయటం మంచిది. దీనికోసం, ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి, ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో, ఆ క్రమంలో మాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా, పూజించ కూడదు.

భక్తి భావంతో గీత, వాద్య, నృత్యాలతో, ఇలా ఆ రాత్రి తొలి యామం (ఝాము) పూజను పూర్తిచేయాలి. శివ మంత్రానుష్ఠానం ఉన్నవారు, పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రత మాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జాములలోనూ, ఆ రాత్రి అంతా చెయ్యాల్సి ఉంటుంది. వ్రతానంతరం, యధాశక్తిగా పండితులకూ, శివభక్తులకూ, విశేషించి సన్యాసులకూ, భోజనాన్ని పెట్టి, సత్కరించాలి. నాలుగు ఝాములలో చేసే పూజ, కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి ఝాములో పార్థివ లింగాన్ని స్థాపించి, పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం, ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి.

చందనం, నూకలు లేని బియ్యం, నల్లని నువ్వులతో పూజ చేయాలి. ఎర్ర గన్నేరు, పద్మంలాంటి పుష్పాలతో అర్చించాలి. భవుడు, శర్వుడు, రుద్రుడు, పశుపతి, ఉగ్రుడు, మహాన్‌, భీముడు, ఈశానుడు, అనే శివదశ నామాలను స్మరిస్తూ, ధూప దీప నైవేద్యాలతో, అర్చన చేయాలి. అన్నం, కొబ్బరి, తాంబూలాలను నివేదించాలి. అనంతరం, ధేను ముద్రను చూపి, పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం, అయిదుగురు పండితులకు భోజనం పెట్టడంతో, తొలిఝాము పూజ ముగుస్తుంది.

రెండవ ఝాములో, తొలి ఝాముకన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులూ, యవలూ, కమలాలూ, పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతంతా, తొలి ఝాములాంటిదే.

మూడవ ఝాములో చేసే పూజలో, యవల స్థానంలో, గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో, శివపూజ చేయాలి. వివిధ ధూప దీపాలనూ, శాక పాకాలనూ, అప్పాలనూ నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత, దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ, అంతకు ముందులాగే ఉంటాయి.

నాలుగవ ఝాములో, పూజా ద్రవ్యాలుగా, మినుములూ, పెసలు లాంటి ధాన్యాలనూ, శంఖ పుష్పాలనూ, మారేడు దళాలనూ వాడాలి. నైవేద్యంగా, తీపి పదార్థాలనుగానీ, మినుములతో కలిపి వండిన అన్నాన్నీగానీ పెట్టాలి. అరటి పండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో, శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తి పూర్వకంగా, నాలుగు ఝాములలోనూ, ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ ఝాముకు ఆ ఝాము పూజ పూర్తికాగానే, ఉద్వాసన చెప్పటం, మళ్ళీ తరువాతి ఝాము పూజకు సంకల్పం చెబుతుండాలి.

నాలుగు ఝాముల శివరాత్రి వ్రతం ముగిశాక, పండితులకు పుష్పాంజలి సమర్పించి, వారి నుండి తిలకాన్నీ, ఆశీర్వచనాన్నీ స్వీకరించి, శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రత క్రమాన్ని, శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో, క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటాననీ, సర్వశుభాలూ, సుఖాలూ కలిగిస్తాననీ, శివుడు బ్రహ్మ, విష్ణు, పార్వతులకు వివరించి చెప్పాడు.. 

దారిద్ర్య దహన స్తోత్రం!

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ

కర్ణామృతాయ శశిశేఖరధారణాయ ।

కర్పూరకాంతిధవళాయ జటాధరాయ

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౧॥

గౌరీప్రియాయ రజనీశకళాధరాయ

కాలాంతకాయ భుజగాధిప కంకణాయ ।

గంగాధరాయ గజరాజ విమర్దనాయ

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౨॥

భక్తప్రియాయ భవరోగ భయాపహాయ

ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ ।

జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౩॥

చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ

భాలేక్షణాయ మణికుణ్డలమణ్డితాయ ।

మంజీరపాదయుగళాయ జటాధరాయ

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౪॥

పఞ్చాననాయ ఫణిరాజవిభూషణాయ

హేమాంశుకాయ భువనత్రయమణ్డితాయ ।

ఆనన్దభూమివరదాయ తమోమయాయ

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౫॥

భానుప్రియాయ భవసాగరతారణాయ

కాలాన్తకాయ కమలాసనపూజితాయ ।

నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౬॥

రామప్రియాయ రఘునాథవరప్రదాయ

నాగ/నామ ప్రియాయ నరకార్ణవతారణాయ ।

పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౭॥

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ

గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ ।

మాతఙ్గచర్మవసనాయ మహేశ్వరాయ

దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ ॥ ౮॥

వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం ।

సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ ।

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ ॥ ౯॥

॥ ఇతి శ్రీవసిష్ఠవిరచితం దారిద్ర్యదహనశివస్తోత్రం సంపూర్ణమ్ ॥

ఓం నమః శివాయ!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes